న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ( Gold price ) స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.226 తగ్గి రూ.45,618కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం బంగారం ధర రూ.45,844 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే ఇవాళ దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.462 తగ్గి రూ.59,341కి దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.59,803 వద్ద ముగిసింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,747 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 22.35 అమెరికన్ డాలర్లు పలికింది.