Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు లోబడి దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారెట్స్) బంగారం ధర రూ.250 తగ్గి రూ.63,200 పలికింది. ఇంతకుముందు సెషన్లో తులం బంగారం ధర రూ.63,450 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.400 క్షీణించి రూ.76,300 వద్ద నిలిచింది. ఇంతకుముందు సెషన్లో రూ.76,700 వద్ద స్థిర పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర రూ.355 తగ్గి రూ.62,202 వద్ద నిలిచింది. మార్చి కాంట్రాక్ట్ కిలో వెండి ధర సైతం రూ.415 పడిపోయి రూ.72,172 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం ధర 2029 డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.95 డాలర్ల వద్ద ట్రేడయింది.
అమెరికాలో భారీగా ఉద్యోగాలు కల్పించిన నేపథ్యంలో వడ్డీరేట్ల తగ్గింపు మరికొంత కాలం తగ్గిస్తే బాగుంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, దానివల్లే దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా న్యూయార్క్లో బంగారం ఫ్యూచర్స్ మార్కెట్ ధర 2038.10 డాలర్లు పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 16 డాలర్లు తగ్గి, 2029 డాలర్ల వద్ద స్థిర పడింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమొడిటీ రీసెర్చ్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవ్నీత్ దమానీ స్పందిస్తూ.. ఈ వారంలో వెలువడే యూఎస్ సీపీఐ, ప్రొడక్షన్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) డేటా వివరాలను బట్టి.. వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయంపై క్లారిటీ వస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాల్లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం ధర రూ.200 తగ్గి రూ.57,800లకు పరిమితమైంది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.220 క్షీణించి రూ. 63,050 వద్ద నిలిచింది. చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.200 క్షీణించి రూ.58,300 వద్ద, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.220 తగ్గి రూ.63,600 వద్ద స్థిర పడింది. ఇక హైదరాబాద్తోపాటు చెన్నైలో కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.77,800 వద్ద స్థిర పడింది. కోల్కతా, ముంబైల్లో కిలో వెండి ధర రూ.200 పడిపోయి రూ.76,400 వద్ద కొనసాగుతున్నది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం ధర రూ.200 తగ్గి రూ.57,800 వద్ద నిలిస్తే, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.220 పతనమై రూ.63,050 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.74 వేల వద్ద కొనసాగుతున్నది.