Gold Rates | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల్లో రూ.3750 పతనమై రూ.79,500 మార్కుకు చేరుకున్నది. కిలో వెండి ధర రూ.6,950 వద్ద స్థిర పడింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1,650 పతనమై రూ.79,500 వద్దకు చేరుకుని రూ.80వేల దిగువకు పడిపోయింది. బుధవారం తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.81,150 వద్ద కొనసాగింది. మరోవైపు కిలో వెండి ధర రూ. 2,900 పతనమై రూ.93,800 వద్ద నిలిచింది. బుధవారం కిలో వెండి ధర రూ.96,700 వద్ద స్థిర పడింది.
గురువారం 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1650 క్షీణించి రూ.79,100 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలోనూ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో బంగారం ధర పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర ఫ్లాట్ గా రూ.76,655 వద్ద కొనసాగుతున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ సిల్వర్ కాంట్రాక్ట్స్ ధర రూ.90,811 వద్ద ముగిసింది.
కీలక వడ్డీరేట్ల తగ్గింపు విషయమై గురువారం రాత్రి వెలువడనున్న యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 1.90 డాలర్లు తగ్గి 2674 డాలర్లు పలికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక నేపథ్యంలోనే బంగారం ధర తగ్గుతుందని భావిస్తున్నారు. ఔన్స్ వెండి ధర 0.24 శాతం తగ్గి 31.26 డాలర్లకు పడిపోయింది. జూలై తర్వాత తొలిసారి అమెరికా డాలర్ విలువ పెరిగింది.