Gold Investment | భారతీయులకు అందునా అతివలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు పెండ్లిండ్ల సీజన్. ఇటీవల అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో డాలర్ విలువ బలోపేతమైంది. పెట్టుబడికి ఆల్టర్నేటివ్ రూట్గా భావిస్తున్న బంగారానికి గిరాకీ తగ్గినట్లు కనిపిస్తున్నది. ఈ నెల 9న మేలిమి బంగారం తులం ధర రూ.51,699 అని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లరీస్ అసోసియేషన్ (ఏబీజేఏ) తెలిపింది. ఇప్పుడు అంటే శనివారం బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.50,465లకు దిగి వచ్చింది. అంటే వారంలో తులం బంగారం ధర రూ.1,234 తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన టైం అని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు.
24 క్యారట్ల బంగారం తులం ధర శనివారం రూ.50,465 అయితే, 23 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,263, 22 క్యారట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.46,226, 18 క్యారట్ల (10 గ్రాములు ) పసిడి ధర రూ.37,849గా నమోదైందని ఏబీజేఏ తెలిపింది. వెండి ధర కూడా రూ.59 వేల కు దిగి వచ్చిందని ఐబీజేఏ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో కిలో వెండిధర రూ.62,352 పలికితే శనివారం రూ.59,106లకు దిగి వచ్చింది. దీని ప్రకారం కిలో వెండిధర ఈ వారంలో రూ.3,246 తగ్గింది.
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు ఇంటి వద్ద నుంచి ఎప్పటికప్పుడు సరైన ధర తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చునని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లరీస్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది. 8955664433 అనే ఫోన్ నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే మీ ఫోన్లోకి బంగారం, వెండి ధరలపై మెసేజ్ వస్తుంది.
అన్ని రకాల ధరలు పెరిగిపోతుండటంతో ఈ ఏడాది చివరిలోగా తులం బంగారం ధర రూ.55 వేలు దాటుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రకటించింది. మున్ముందు బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. వచ్చే 12 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2050 డాలర్లు దాటొచ్చునని, కామెక్స్లో మేలిమి బంగారం రూ.55,320కి చేరొచ్చునని అంచనా. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం విక్రయాల్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు. ఈ ఏడాది తులం బంగారం రూ.55 వేల మార్క్ను దాటే అవకాశం కనిపిస్తున్నదన్నారు. కనుక బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సరైన టైం అని అన్నారు.