Gold Rates | బంగారం ధర మళ్లీ పెరుగుతున్నది. సోమవారం బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం రూ.52 వేల మార్క్ను దాటేసింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ ప్రకారం 24 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.52,339 పలికింది. ఇది రెండు నెలల గరిష్ఠం. ఇంతకుముందు గత మార్చి 22న తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.52,474 పలికింది. ఆ తర్వాత పుత్తడి ధరలు క్రమంగా పడిపోయాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర రూ.212 తగ్గి రూ.52,129 పలికింది.
24 క్యారట్ల బంగారం తులం ధర రూ.52,339 అయితే, 23 క్యారట్ల బంగారం ధర రూ.52,129, 22 క్యారట్ల బంగారం తులం రూ. 47,943, 18 క్యారట్ల పుత్తడి ధర రూ. 39,254 పలుకుతున్నది. కిలో వెండి ధర స్పాట్ మార్కెట్లో రూ.240 పెరిగి రూ.58,013 పలికింది. ఎంసీఎక్స్లో మధ్యాహ్నం ఒంటి గంటలకు రూ.146 పెరిగి రూ.58,321కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,808.81 డాలర్లకు చేరితే, ఔన్స్ వెండి ధర 19.83 డాలర్లు పలికింది.
కరంట్ ఖాతా లోటు (క్యాడ్) తగ్గించుకోవడంతోపాటు పుత్తడిపై మోజును నిరుత్సాహ పరిచేందుకు బంగారంపై బేసిక్ దిగుమతి సుంకాన్ని కేంద్రం 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచేసింది. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అమెరికా సహా జీ-7 దేశాలు.. రష్యా నుంచి బంగారం దిగుమతిని నిషేధించాయి. ముడి చమురు తర్వాత ప్రపంచ దేశాలకు బంగారం ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో బంగారం ధర మరింత పెరిగి పోయే అవకాశాలు ఉన్నాయి.