హైదరాబాద్, డిసెంబర్ 2: పుత్తడి ధరలు రికార్డుల్లో పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైకి చేరుకున్న రేట్లు.. రోజుకో సరికొత్త స్థాయిని అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్లో తులం మరో రూ.810 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.63,760ని తాకింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ పసిడి సైతం రూ.750 ఎగిసి రూ.58,450ను చేరింది. ఇక ఢిల్లీలోనూ రూ.810 పుంజుకొని రూ.63,910 వద్ద 24 క్యారెట్ గోల్డ్ రేటు నిలిచింది. అలాగే 22 క్యారెట్ 10 గ్రాములు రూ.750 పెరిగి రూ.58,600గా నమోదైంది.
క్రమేణా పెరుగుతూ..
బంగారం ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ తులం రూ.1,570, 22 క్యారెట్ రూ.1,315 మేర ఎగిశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చారిత్రక గరిష్ఠాన్ని చేరుకున్నాయి. పండుగ సీజన్, పెండ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్లో పుత్తడి విక్రయాలు భారీ ఎత్తున జరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ధనత్రయోదశికి బంగారం అమ్మకాలు పెరిగిన విషయం తెలిసిందే. కడ్డీలు, నాణేలు, నగల కొనుగోళ్లకు అన్ని వర్గాలవారు ఆసక్తి కనబర్చారు. 24 క్యారెట్తోపాటు 22, 18 క్యారెట్ గోల్డ్కూ ఆదరణ కనిపించడం విశేషం.
వెండి రేట్లూ రయ్.. రయ్
బంగారం ధరలతోపాటు వెండి ధరలూ పెరుగుతున్నాయి. శనివారం కిలో వెండి ధర హైదరాబాద్లో ఏకంగా రూ.1,000 ఎగిసి రూ.83,500లను తాకింది. గత 10 రోజుల్లో రూ.4,500 పెరగడం గమనార్హం. ఢిల్లీలోనూ రూ.1,000 పుంజుకొని రూ.80,500 వద్ద స్థిరపడింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచీ డిమాండ్ ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపార విశ్లేషకులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,050 డాలర్లను సమీపించింది. సిల్వర్ 25 డాలర్లు దాటింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ, వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ వైఖరి ఇన్వెస్టర్లను అమితంగా ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే గోల్డ్ రేట్లు ఇంకా పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు.