న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: బంగారం ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.350 దిగి రూ.60 వేల దిగువకు రూ.59, 650కి చేరుకున్నది. పసిడితోపాటు వెండి భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఉన్నప్పటికీ దేశీయంగా భారీగా తగ్గడం విశేషం. కిలో వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.73,400కి దిగింది. హైదరాబాద్లో తులం పసిడి ధర రూ.380 తగ్గి రూ.59,450కి దిగిరాగా, 22 క్యారెట్ల ధర రూ.340 తగ్గి రూ.54,500కి తగ్గింది. అలాగే రూ.1,000 తగ్గిన కిలో వెండి రూ.78 వేల నుంచి రూ.77 వేలకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,911 డాలర్లకు, వెండి 22.94 డాలర్ల వద్ద ముగిశాయి. బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.