Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం మెరుస్తున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.820 పెరిగి రూ.64,040లకు దూసుకెళ్లింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం పది గ్రాములు రూ.750 పెరిగి రూ.58,250 వద్ద స్థిర పడింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మహారాష్ట్ర రాజధాని ముంబై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాల్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం రూ.750 పెరిగి రూ.58,100 వద్ద స్థిర పడితే, 24 క్యారెట్స్ బంగారం తులం రూ.820 పుంజుకుని రూ.63,380 వద్ద నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.750 పుంజుకుని రూ.58,250 వద్ద ముగిసింది. 24 క్యారెట్స్ బంగారం పది గ్రాములు ధర రూ.820 పెరిగి రూ.63,530 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.79 వేల మార్కుకు చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి లోహాలకు గిరాకీ పెరగడం వల్ల దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2041 డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.95 డాలర్లు పలికింది.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో డాలర్ బలహీన పడింది. దీంతో ట్రేడర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా గత మేతో పోలిస్తే బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయికి దూసుకెళ్లిందని సౌమిల్ గాంధీ వెల్లడించారు. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లోనూ బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.81 పెరిగి రూ.62,466 పలికింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.12 శాతం పెరిగి 2062.70 డాలర్లకు చేరుకున్నది.