ముంబై, డిసెంబర్ 30: బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మందగించిన పసిడి మెరుపులు.. కొత్త ఏడాదిలో కాంతులు విరజిమ్మవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా ప్రకంపనలు, ద్రవ్యోల్బణం భయాలు, బలపడనున్న అమెరికా డాలర్ మధ్య కూడా 10 గ్రాముల ధర రూ. 55,000 దాటుతుందని అంటున్నారు. గతేడాది ఆగస్టులో ఎంసీఎక్స్పై రికార్డు స్థాయిలో పుత్తడి విలువ రూ.56,200 పలికిన విషయం తెలిసిందే. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్లో ప్రస్తుతం రూ.47,800 స్థాయిలో ధర కదలాడుతున్నది. దీంతో దాదాపు 14 శాతం తగ్గుముఖం పట్టినైట్లెంది. ఈ ఏడాది ఆరంభంతో చూస్తే ఇది 4 శాతం తక్కువ. అయినప్పటికీ అంతర్జాతీయ ధరలతో పోల్చితే 3 శాతం అధికంగా ఉన్నది. ఇందుకు కారణం డాలర్తో పోల్చితే రూపాయి బలహీనతేనని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు ధర 1,791 డాలర్ల వద్ద ఉన్నది.
పెట్టుబడులు పెరిగితే..
కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్ విజృంభణ మధ్య స్టాక్ మార్కెట్లు కుప్పకూలితే.. మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం మరోసారి బంగారం వైపు చూడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడులు పెరిగితే బంగారం ధరలు పరుగులు పెట్టవచ్చని చెప్తున్నారు. వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు కూడా డాలర్ విలువను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ఈ పరిణామాలూ గోల్డ్ ధరల్ని శాసిస్తాయని పేర్కొంటున్నారు.
ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు
ద్రవ్యోల్బణం పెరిగితే బంగారానికి డిమాండ్ కూడా పెరుగుతుందని ప్రపంచ స్వర్ణ మండలి ప్రాంతీయ సీఈవో సోమసుందరం తెలిపారు. అధిక ఇంధన ధరలు వస్తూత్పత్తుల రవాణా ఖర్చులను పెంచేస్తున్నాయని అన్నారు. దీంతో రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చన్న ఆయన ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనాలనూ సవరించిందన్నారు.
‘ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున నగదు ప్రవాహం జరిగింది. దీనివల్ల బంగారం ధరలు అంచనాలకు తగ్గట్టుగా పెరగలేదు. కరోనా ఒమిక్రాన్ భయాల మధ్య క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలపై పలు ఐరోపా దేశాలు ఆంక్షలు
విధిస్తుండటం గ్లోబల్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నది. ఇక వచ్చే ఏడాది ప్రథమార్ధం
(జనవరి-జూన్)లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,700-1,900 డాలర్ల మధ్య కదలాడవచ్చు.
ద్వితీయార్ధం
(జూలై-డిసెంబర్)లో 2,000 డాలర్లను అధిగమించే వీలున్నది. దేశీయ మార్కెట్లోనూ వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో తులం బంగారం ధర రూ.45,000-50,000 మధ్య ఉండొచ్చు. రెండో అర్ధభాగంలో రూ.55,000పైనే పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి’
-జ్ఞానశేఖర్ త్యాగరాజన్, కామ్ట్రెండ్జ్ సీఈవో