హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో విద్యార్థుల చేతిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు గురికావడం శాంతి, భద్రతల రక్షణలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమేనని పేర్కొన్నారు.
శాంతిభద్రతలపై సమీక్షించి పరిస్థితులను చక్కదిద్దాల్సిన హోమ్మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పాలనను గాలికొదిలి తన పనులు చక్కదిద్దుకుంటున్నారని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైన ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో షీటీమ్లను నియమించి, వాడవాడలా సీసీ కెమెరాలు పెట్టి మహిళల భద్రతకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాడు కేసీఆర్ పెట్టిన సీసీ కెమెరాలను సైతం వినియోగించుకోవడమే లేదని, షీటీమ్లను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
షాబాద్లో పోక్సో కేసు నిందితుడు ఆరుగురు అమాయకులను హతమార్చినా, హైదరాబాద్ నడిబొడ్డున రిటైర్ట్ ఐపీఎస్ భార్యను కత్తులతో పొడిచి చంపినా పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారని గొంగిడి సునీత ఆందోళన వ్యక్తంచేశారు. కానీ, పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర మంత్రి కొడుకును సీఎం కాపాడారని ఆరోపించారు. డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దానిని కట్టడి చేయాల్సిన ఈగల్ ఫోర్స్ ఈగలు కొడుతున్నదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ఆస్తులు సంపాదించుకోవడం, విదేశాల్లో చక్కర్లు కొట్టడంపై ఉన్న ధ్యాస మహిళల రక్షణపై లేదని మండిపడ్డారు. కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య వెనుక డ్రగ్స్ మాఫియా హస్తం ఉన్నదని ఆరోపించారు. ఈ హత్యపై కుట్ర కోణంలో విచారణ జరుపాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి మత్తులో యువత చిత్తవుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆందోళన వ్యక్తంచేశారు. నియంత్రించాల్సిన ప్రభుత్వం నిద్రపోతున్నదని విరుచుకుపడ్డారు. విద్యార్థుల చేతిలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ హత్యకు గురికావడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు ఓ జువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడ్డ దుండగులు బైక్లపై పారిపోయినా పట్టుకొనే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. విద్యార్థుల మీటింగ్లు, బహిరంగసభల్లో సీఎం రేవంత్రెడ్డి పేగుల భాష మాట్లాడుతూ ఉన్మాద శక్తులకు ఊతంగా నిలుస్తున్నారని దెప్పిపొడిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల భద్రతపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.