Gold Rates | హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 23: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు కాస్త శాంతించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు కుప్పకూలాయి. దీంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో అయితే ఏకంగా తులం ధర రూ.1,050 దిగింది. దీంతో తులం పుత్తడి ధర రూ.73,550కి దిగొచ్చింది. ధరలు తగ్గడం వరుసగా రెండోరోజు కావడం విశేషం. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.1,090 తగ్గి రూ.73,420కి దిగొచ్చింది. అంతకుముందు ధర రూ.74,510గా ఉన్నది. అలాగే రూ.1,000 తగ్గిన 22 క్యారెట్ ధర తులం ధర రూ.68,300 నుంచి రూ.67,300కి దిగింది. ఈ వారం మొదట్లో రికార్డు స్థాయి రూ.74,440కి చేరుకున్న పుత్తడి ధర మూడు శాతానికి పైగా దిగొచ్చింది.
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.3,300 దిగొచ్చింది. దీంతో రూ.1,00,300గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.97 వేలకు తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,500 తగ్గి రూ.92,600కి చేరుకున్నది. అంతకుముందు రూ.95,100 గా ఉన్నది. అలాగే ఫెడ్ రిజర్వు సభ్యుడు వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో ఒకేరోజు ఔన్స్ ధర 42 డాలర్లు పడిపోయి 2,375 డాలర్లకు చేరుకున్నది. అలాగే వెండి ధర 30.80 డాలర్ల వద్ద నిలిచింది.