Gold Price | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బంగారం ధరలు రికార్డు స్థాయిలో పరుగెడుతున్నాయి. బుధవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధర రూ.72 వేల మార్క్ను అధిగమించి మరో ఉన్నత శిఖరాలకు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల అంశాలకు తోడు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల ధర రూ.160 ఎగబాకి రూ. 72 వేలకు చేరుకన్నది. మంగళవారం ఈ ధర రూ.71.840 వద్ద ఉన్నది. ఇటు హైదరాబాద్లోనూ 24 క్యారెట్ పదిగ్రాముల ధర మరో రూ.380 అందుకొని రూ.72,110ని తాకింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.350 పెరిగి రూ.66,100కి చేరుకున్నది.
రికార్డుకు వెండి ధరలు
పసిడితోపాటు వెండి ధరలు కూడా రికార్డుస్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.200 అధికమై రూ.84,700 పలికింది. ఇటు హైదరాబాద్లో రూ.1,000 ఎగబాకి రూ.89 వేలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,356 డాలర్లకు చేరుకున్నది. నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు అధికమైంది. అలాగే వెండి 28.10 డాలర్లుగా ఉన్నది.