న్యూఢిల్లీ: ముంబై సీపీ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఇవాళ లోక్సభలోని జీరో అవర్లో చర్చ జరిగింది. ఆ సమయంలో 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడారు. మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తప్పుపట్టారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లు చర్చ సందర్భంగా ఇవాళ ఆమె లోక్సభలో మాట్లాడారు. కొంత సేపు మరో అంశంపై మాట్లాడాలనుకుంటున్నానని, సాధారణంగా నేను ఇలా మాట్లాడను అని, ఇవాళ జీరో అవర్ రిగ్గింగ్ అయ్యిందని, ఒకే ఒక అంశంపై 8 మంది ఎంపీలు మాట్లాడారని, మా పార్టీకి చెందిన వారికి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి నల్ల దినమని ఆమె అన్నారు. పబ్బులు, రెస్టారెంట్ల నుంచి నెలకు వంద కోట్లు వసూల్ చేయాలని మహారాష్ట్ర హోంమంత్రి ఆదేశించినట్లు ముంబై మాజీ పోలీసు కమీషన్ పరంబీర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ అంశంపై ఇవాళ జీరో అవర్లో చర్చించారు.
ఇక ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ గురించి కూడా సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఈ బిల్లును యూపీఏ తెచ్చిందని, కానీ అప్పుడు దీన్ని ఎన్డీఏ వ్యతిరేకించిందన్నారు. ఇటీవల మహారాష్ట్రలో రెండు గంటల పాటు కరెంటు పోయిందని, దాని వెనుక చైనా సైబర్ దాడి కుట్ర ఉన్నట్లు తేలిందని, మరి విదేశీ కంపెనీల జోక్యం పెరిగితే అప్పుడు పేదవారి పరిస్థితి ఏంటని ఆమె అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు అని, కానీ కంపెనీలను మానిటైజ్ చేస్తున్నప్పుడు మనకు రావాల్సిన డబ్బు వస్తుందా అని ఆమె అడిగారు.