న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు మూడు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి ఏకంగా రూ.2.7 లక్షలకు చేరుకోగా, బంగారం రూ.1.6 లక్షలు పలికింది. ఫలితంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.3,300 లేదా 2 శాతం ఎగబాకి రూ.1,62,800కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.1,59,500గా ఉన్నది. అలాగే కిలో వెండి రూ.8 వేలు లేదా 3.03 శాతం ఎగబాకి రూ.2.72 లక్షలకు చేరుకున్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,070 ఎగబాకి రూ.1,61,350 పలికింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,900 అందుకొని రూ.1,47,900కి చేరుకున్నది. వెండి రూ.10 వేలు అందుకొని రూ.3 లక్షలకు చేరుకున్నది.
ట్రంప్నకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతోపాటు అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటం ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3 శాతం లేదా 154 డాలర్లు ఎగబాకి 5,235 డాలర్లు పలుకగా, వెండి 6 శాతం లేదా 4.87 డాలర్లు అందుకొని 87 డాలర్లకు చేరుకున్నది.