న్యూఢిల్లీ, డిసెంబర్ 13: బంగారం ధర ఒక్కసారిగా వువ్వెత్తున పెరిగింది. అమెరికాలో నవంబర్ నెల ద్రవ్యోల్బణం తగ్గిందన్న వార్తతో మంగళవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సు ధర 40 డాలర్ల మేర ర్యాలీ జరిపి 1,832 డాలర్ల వద్ద నిలిచింది. ఈ ప్రభావంతో దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో ట్రేడయ్యే బంగారం ధర రూ.55,000కు చేరువయ్యింది. ఇది రూ.730 మేర పుంజుకుని, 54,850 వద్దకు చేరింది. భారత్లోని వివిధ నగరాల్లో స్పాట్ మార్కెట్లో ఈ మేరకు బుధవారం భారీగా బంగారం ధర పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో మంగళవారం రూ.54,330 వద్ద ముగిసింది.
ఫెడ్ నిర్ణయం కీలకం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం సమీప భవిష్యత్తులో బంగారం ధర కదలికలు కీలకమని నిపుణులు చెపుతున్నారు. డిసెంబర్ 14న ఫెడ్ కమిటీ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనున్నది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 7.1 శాతానికి దిగిరావడంతో ఫెడ్ రేట్ల పెంపు ప్రక్రియకు త్వరలో బ్రేక్ పడుతుందన్న అంచనాలు ఏర్పడటంతో డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ నిలువునా పడిపోయాయి. ఈ ప్రభావంతో బంగారం, షేర్లు, క్రూడ్ ధరలు పెద్ద ర్యాలీ జరిపాయి. ఫెడ్ తాజా సమీక్షలో అరశాతం మేర పెంచవచ్చన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. వచ్చే ఏడాది రేట్ల పెంపుపై ఫెడ్ ఇచ్చే సంకేతాలు పుత్తడి ధరను నిర్దేశిస్తాయని విశ్లేషకులు వివరించారు.