న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 18: బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేకపోవడం, మరోవైపు క్రూడాయిల్ భగ్గుమంటుండటం, రూపాయి పతనమవడంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు అధికమవుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.53,460 పలికింది. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి ధర రూ.990 అధికమై రూ.69,930 పలికింది. అటు హైదరాబాద్లోనూ 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54 వేల పైకి చేరుకున్నది. వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధర సోమవారం మరో రూ.320 అధికమై రూ.54,380 పలికింది. 22 క్యారెట్ల ధర రూ.300 ఎగబాకి రూ.49,850కి చేరుకున్నది. వెయ్యి రూపాయల వరకు అధికమైన కిలో వెండి రూ.75,200కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,993 డాలర్లు, 25.88 డాలర్ల వద్ద వెండి ఉన్నది.