Gold Price | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్టైమ్ హైకి వెళ్లాయి. ఢిల్లీలో సోమవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత కలిగిన గోల్డ్) 10 గ్రాములు మునుపెన్నడూ లేనివిధంగా రూ.68,420ని చేరింది. ఈ ఒక్కరోజే రూ.1,070 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ ప్రభావం.. భారతీయ మార్కెట్లపైనా ఉన్నదని ట్రేడింగ్ నిపుణులు మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక ఫ్యూచర్ మార్కెట్లోనూ పసిడికి డిమాండ్ పెద్ద ఎత్తునే కనిపించింది. జూన్ నెల కాంట్రాక్ట్కుగాను రూ.978 పెరుగుదలతో రూ.68,679 పలికింది. కాగా, పన్నులతో కలిపితే ఢిల్లీలో తులం రూ.71,000 దరిదాపుల్లోకి వెళ్లినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్లో రూ.930 ఎగిసి రూ.69,380 వద్ద రేట్లున్నాయి. పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో మార్కెట్లో బంగారానికి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఉంటున్నదని వర్తకులు చెప్తున్నారు.
పసిడితోపాటు వెండి ధరలూ పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి ధర ఢిల్లీలో రూ.1,120 ఎగబాకి రూ.78,570గా నమోదైంది. హైదరాబాద్లో రూ.600 పుంజుకొని రూ.81, 600 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్సు గోల్డ్ ధర 2,265.73 డాలర్లుగా ఉన్నది. వెండి రేటు 25.13 డాలర్లుగా ఉన్నది. మొత్తానికి దేశీయ మార్కెట్లో సాధారణ వినియోగదారులతోపాటు పారిశ్రామిక వర్గాలు, మదుపరుల ఆసక్తితో బంగారం, వెండి ధరలు పెరుగుతూపోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్ తీరు ఇలాగే ఉంటే పసిడి, వెండి ధరల్లో మున్ముందు సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయమన్న అభిప్రాయాలు ఇటు నిపుణుల నుంచి అటు మార్కెట్ వర్గాల నుంచి ప్రస్తుతం పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నా.. బంగారం రేట్లు మాత్రం రికార్డుల్ని సృష్టిస్తున్నాయంటే.. స్టాక్స్ పడిపోతే ధరలు మరింత పెరుగుతాయనే చెప్తున్నారు. ఇందుకు కారణం మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణగా గోల్డ్ను ఎంచుకుంటారని అంటున్నారు. అందుకే పుత్తడి రేట్లు సమీప భవిష్యత్తులో పెరగడమే తప్ప పెద్దగా తగ్గబోవనీ వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది తులం బంగారం రూ.75,000లను దాటేస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేయడం ఈ ధోరణికి ఊతమిస్తున్నది.