న్యూఢిల్లీ, డిసెంబర్ 14: బంగారం ధరలు భగ్గుమన్నాయి. వచ్చే ఏడాదిలో వడ్డీరేట్లను తగ్గించకతప్పదని ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. గురువారం ఒకేరోజు తులం బంగారం రూ.1,130 అధికమై ఢిల్లీలో రూ.62,950 పలికింది. అంతకుముందు ఇది రూ.61,820గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వెండి ఏకంగా రెండు వేల రూపాయల కంటే అధికమైంది.
కిలో వెండి ధర రూ.2,350 ఎగబాకి రూ.77, 400 పలికింది. అటు హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,000 అందుకొని రూ.56,650 నుంచి రూ.57,650 కి చేరుకోగా, 24 క్యారెట్ల ధర రూ.1,090 పెరిగి రూ.62,890 పలికింది. అలాగే కిలో వెండి రూ.2,500 అందుకొని రూ.79,500కి చేరింది. అంతర్జాతీయ మార్కె ట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,032 డాలర్లకి, వెండి 24 డాలర్లు పలికింది. క్రమంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోయినా అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే ఏడాది వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని సంకేతాలు వల్లనే ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.