న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు సోమవారం రూ.1.52 లక్షలకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్ పతనమవడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.12,800 లేదా 7.73 శాతం తగ్గి రూ.1,52,700కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,65,500గా ఉన్నది. గత మూడు సెషన్లలో పుత్తడి ధర రూ.30,300 లేదా 17 శాతం తగ్గినట్టు అయింది. జనవరి 29న రికార్డు స్థాయి రూ.1.83 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి అంతే వేగంతో కిందికి పడిపోయింది. కిలో వెండి ఏకంగా రూ.52 వేలు(17 శాతం) తగ్గి రూ.2.60 లక్షలకు దిగొచ్చింది. గత శనివారం వెండి రూ.72,500 తగ్గిన విషయం తెలిసిందే. గత మూడు సెషన్లలో కిలో వెండి ఏకంగా రూ.1.44 లక్షలు లేదా 36 శాతం చొప్పున పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, డాలర్ విలువ మరింత బలోపేతం కావడం, ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపుపై అనిశ్చితి నెలకొనడం ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,690 డాలర్లు, వెండి 77 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.