హైదరాబాద్, అక్టోబర్ 18: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో గత వారాంతంలో ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధర రెండు రోజులపాటు క్రమేపీ తగ్గిన తర్వాత తిరిగి బుధవారం జోరందుకుంది. ప్రపంచ స్పాట్ మార్కెట్లో కడపటి సమాచారం అందేసరికి ఔన్సు పుత్తడి 22 డాలర్ల మేర పెరిగి 1,945 డాలర్ల సమీపంలో ట్రేడవుతున్నది. ఇది ఒకదశలో 1,960 డాలర్ల స్థాయిని సైతం చేరింది.
గాజాలో హాస్పిటల్పై జరిగిన దాడులతో మధ్యప్రాచ్యంలో సంక్షోభం తీవ్రతరమయ్యిందని, దీంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర నాలుగు వారాల గరిష్ఠస్థాయికి చేరిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.540 మేర పెరిగి రూ.60,490 వద్దకు చేరింది. 22 క్యారెట్ల పుత్తడి రూ.500 అధికమై రూ.55,450 వద్ద నిలిచింది.