న్యూఢిల్లీ, నవంబర్ 15: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రూ.440 ఎగిసి రూ.61,040 వద్దకు చేరింది. 22 క్యారెట్ పుత్తడి కూడా రూ.400 ఎగబాకి రూ.55,950 పలికింది. మంగళవారం సైతం రేట్లు పెరగగా, అంతకుముందు వరుసగా ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలోనూ పది గ్రాముల మేలిమి బంగారం రూ.410 పుంజుకొని రూ.61,210గా ఉన్నది. ధంతేరాస్, దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా అమ్మకాలు జోరుగా సాగిన సంగతి విదితమే. గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు 15 శాతం పెరిగినట్టు వ్యాపారులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటు దేశీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్, అటు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే కిలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్లో ఒక్కరోజే రూ.1,700 ఎగబాకి రూ.77, 700 తాకింది. ఢిల్లీలో రూ.75,000లుగా నమోదైంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్సు పుత్తడి 1,970 డాలర్లు, వెండి 23.27 డాలర్లుగా ఉన్నది.