Gold Price | న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఒకవైపు వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కితీసుకుంటుండటంతో ఈక్విటీలతోపాటు అతి విలువైన లోహాలు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంట్లోభాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర రూ.1,050 తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.91,250కి దిగొచ్చింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర అంతే తగ్గి రూ.89,750కి దిగొచ్చింది.
పసిడితోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి రూ.500 తగ్గి రూ.93,200కి దిగొచ్చింది. కానీ, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 61.98 డాలర్లు ఎగబాకి 3,044.14 డాలర్లకు ఎగబాకగా, వెండి 2 శాతం అధికమై 30.41 డాలర్లకు చేరుకున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం మరింత ముదురుతుండటంతో పెట్టుబడిదారులు వేచి చూసేధోరణి అవలంభిస్తున్నారని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. మరోవైపు, యూఎస్ ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ విడుదల చేయబోయే మినిట్స్, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై విశ్లేషకులు దృష్టి సారించారని చెప్పారు.