Gold Rates | వచ్చే జూన్ లో 25 బేసిక్ పాయింట్లు కీలక వడ్డీరేట్లు తగ్గి్స్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లకు జోష్నిచ్చింది. ఫలితంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో (ఎంసీఎక్స్) తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,193 పెరిగింది. ఈ ఏడాది మూడు దఫాలు వడ్డీరేట్లు తగ్గించేందుకు సిద్ధమని జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు.
దీంతో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర సుమారు 1.8 శాతం పెరిగి రూ.66,943వద్ద స్థిర పడింది. మరోవైపు ఎంసీఎక్స్లో కిలో వెండి ధర ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.3,010 (నాలుగు శాతం) పెరిగి రూ.78,323 వద్ద నిలిచింది. మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో రూ.930 పుంజుకుని 76,243 వద్ద ముగిసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాల్లో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1090 పెరిగి 67,420, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 పుంజుకుని రూ.61,800 పలికింది. ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1090 పెరిగి రూ.67,570, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం రూ.1000 పెరిగి 61,950 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం (24 క్యారట్స్) ధర 2200 డాలర్లు దాటి, 2222.39 డాలర్లకు దూసుకెళ్లి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో 2203.84 డాలర్ల వద్ద ముగిసింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 2.1 శాతం పుంజుకుని 2,206.30 డాలర్లు పలికింది. వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చేసిన ప్రకటన డాలర్ విలువ పతనం కావడానికి దారి తీసింది. స్పాట్ సిల్వర్ 0.4 శాతం పెరిగి 25.70 డాలర్ల వద్ద స్థిర పడింది. డాలర్స్ ఇండెక్స్ లో డాలర్ విలువ వారం కనిష్ట స్థాయికి పడిపోయింది.