Gold Rate |దీపావళి, దంతేరాస్ సందర్భంగా ప్రతి ఇండియన్.. ప్రత్యేకించి మహిళలు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు. ఈ పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం తమ కుటుంబం.. ఇల్లు సకల సంపదలతో అలరారుతుందని వారి విశ్వాసం. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయడానికే మహిళలు మొగ్గుతుంటారు.
ఈ నేపథ్యంలో గురువారం దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.50,900 పలికింది. అదే 22 క్యారెట్ల (తులం) బంగారం రూ.46,700 వరకు వెళ్లింది. బుధవారం ఇదే 24 క్యారెట్ల బంగారం తులం ఢిల్లీలో రూ.51,200 వరకు దూసుకెళ్లింది. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయడానికి బదులు ట్రేడింగ్ ఎక్స్చేంజ్ల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.50,900 పలుకుతుండగా, ఒక గ్రాము రూ.5,090, ఎనిమిది గ్రాముల బంగారం రూ. 40,720, 100 గ్రాములు రూ.5,00,900 పలికింది. ఇక 22 క్యారెట్ల బంగారం తులం రూ. 46,700 పలికితే, ఒక గ్రామ్ ధర రూ.4,670, 8 గ్రాముల బంగారం ధర రూ.37,760, 100 గ్రాముల బంగారం రూ.4,67,000 పలుకుతోంది.దీపావళి నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.51,200, 22 క్యారట్ల తులం బంగారం ధర రూ.46,950కి దూసుకెళ్లింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో తులం బంగారం ధర రూ.47,850, 22 క్యారట్ల బంగారం ధర రూ.46,850కి చేరుకున్నది.
కోల్కతాలో తులం బంగారం రూ.50,100 పలికింది. చెన్నైలో రూ.49,180కి చేరుకుంది. గతేడాది ధంతేరాస్తో పోలిస్తే, ఈ ఏడాది బంగారం ధరలు కాస్త తక్కువేనని 6 శాతం తక్కువ అని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఏబీజేఏ) తెలిపింది. ఈ ఏడాది ప్రీకోవిడ్ స్థాయికి ధంతేరాస్ సేల్స్ వెళతాయని అంచనా వేస్తున్నది.