హైదరాబాద్, మార్చి 14: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల రేటు రూ.760 ఎగిసి రూ.57,980 వద్దకు.. 22 క్యారెట్ల ధర రూ.700 ఎగబాకి రూ.53,150కి చేరాయి.
ఢిల్లీ మార్కెట్లో..
ఢిల్లీ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు దౌడు తీస్తున్నాయి. మంగళవారం 24 క్యారెట్ గోల్డ్ రూ.58,130 పలికింది. 22 క్యారెట్ రూ.53,300లుగా ఉన్నది. సోమవారం ముగింపుతో చూస్తే రూ.760, రూ.700 చొప్పున ఎగిశాయి. అయితే స్పాట్ మార్కెట్లో తులం పసిడి రూ.57,380 వద్ద ట్రేడ్ అవుతున్నది. వెండి కూడా రూ.2,150 ఎగిసి రూ.66,900 వద్ద ఉన్నది.
గ్లోబల్ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 1,909 డాలర్లు, వెండి 20.80 డాలర్లు పలుకుతున్నది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు, అమెరికాలో మూతబడ్డ రెండు ప్రధాన బ్యాంకుల వ్యవహారం.. గ్లోబల్ గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వెండి ధరలు..
వెండి ధర మంగళవారం హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో కిలోకు రూ.2,500 ఎగిసింది. ఢిల్లీలో రూ.68,500లుగా ఉంటే, హైదరాబాద్లో రూ.72,000లుగా ఉన్నది. గడిచిన నాలుగు రోజుల నుంచి వెండి ధరలు పైపైకే వెళ్తుండగా, హైదరాబాద్ మార్కెట్లో కిలో ధర రూ.4,700 పుంజుకున్నది. ఢిల్లీలో రూ.3,250 ఎగిసింది.