న్యూఢిల్లీ, జూలై 7: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలోపేతం కావడం, అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1.50 లక్షలకు దిగొచ్చింది. నిన్నటితో పోలిస్తే రూ.1,400 తగ్గి రూ.1,49,250గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1,50, 650గా ఉన్నది. పసిడితోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ.200 తగ్గి రూ.2,39,800గా నమోదైంది.
ఫెడరల్ రిజర్వు జూన్ నెలకు సంబంధించి మినిట్స్ను విడుదల చేయనుండటంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని ఫలితంగా గోల్డ్ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో వీటి ధరలు భారీగా తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. వీటితోపాటు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రెండోసారి జరుగనున్న చర్చలు కూడా ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 24.54 డాలర్లు తగ్గి 4,140.59 డాలర్లకు పడిపోగా, వెండి 2 శాతం తగ్గి 60.89 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
దేశవ్యాప్తంగా బంగారం తాకట్టుపై రుణా లు తీసుకునేవారి సంఖ్య అమాంతం పెరుగుతున్నది. ప్రధానంగా బ్యాంకులతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు భారీగా బంగారం రుణాలు మంజూరు చేస్తున్నాయి. మే నెలలో ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్లు ఏడాది ప్రాతిపదికన 70 శాతం వృద్ధి నమోదయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది మే నెల చివరినాటికి ఆభరణాల తాకట్టుపై రూ.1.94 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న రుణాలు..ఈసారి మే నెల చివరినాటికి రూ.3.29 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపింది.
దీంట్లో ఎన్బీఎఫ్సీలు రూ.1.19 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయి. మిగతా రుణాలపై గృహ, వాహన, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్లు భారీ వృద్ధిని నమోదు చేసుకున్నాయని పేర్కొంది. అలాగే వ్యవసాయ రుణాలు 17.9 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఇండస్ట్రియల్ రంగంలో రుణాలు 7.3 శాతానికి పరిమితమయ్యాయి.