Gold Rates | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ రూ.60 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ఇప్పుడు రూ.60,200పైనే. గత 6 నెలల్లోనే ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. రాబోయే పెండ్లిళ్ల సీజన్కు ఇదో షాకింగ్ వార్తే.
బంగారం ధరల పరుగు ఎందాక?.. ఎందుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది?.. ఇప్పుడు కొనేస్తే లాభమా?.. లేక ఆగడం మంచిదా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు మనలో చాలా మందిని తొలిచేస్తున్నాయి. అయితే వీటన్నింటి సమాధానం కంటే ముందు నాలుగు ప్రధాన విషయాలను గమనిద్దాం.
2008 సంక్షోభం తర్వాత మళ్లీ అదే స్థాయిలో అమెరికాలో ఒక్కసారిగా బ్యాంకింగ్ రంగ సమస్య తలెత్తింది. ముఖ్యంగా స్టార్టప్లకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చేతులెత్తేసింది. డిపాజిటర్ల సొమ్మును అక్కడి ప్రభుత్వం బీమా సంస్థల నుంచి ఇప్పించాల్సిన పరిస్థితి దాపురించింది. సిగ్నేచర్ బ్యాంక్ పరిస్థితి కూడా అలానే ఉన్నది. ఫస్ట్ రిపబ్లిక్ అనే ప్రాంతీయ బ్యాంక్లో డిపాజిట్లు లేకపోతే ప్రముఖ బ్యాంకులన్నీ కలిసి 30 బిలియన్ డాలర్లను అందులో నింపాల్సి వచ్చింది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థ క్రెడిట్ స్వీస్ దగ్గర నిధులు దాదాపుగా నిండుకోవడం కూడా ఎవరూ ఊహించని పరిణామం. దీంతో రోజుల వ్యవధిలోనే యూఎస్లో బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీసింది.
కోవిడ్ అనంతర పరిస్థితులు పెద్ద కంపెనీలకూ కునుకు పట్టనివ్వడం లేదు. ద్రవ్యోల్బణం, లాభాల క్షీణత, కృత్రిమ మేధస్సుల కారణంగా కొత్త కొలువుల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫేస్బుక్ (మెటా), గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా సుమారు 1,50,000 ఉద్యోగాలు పోయాయి.
కరోనా తర్వాతి పరిణామాలతో గత 40 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం 6 శాతానికి వచ్చింది. దీన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతూపోతున్నది. గడిచిన ఏడాది కాలంలో వడ్డీరేట్లు 4.5 శాతం పెరిగాయి. దీంతో బాండ్ మార్కెట్ అతలాకుతలమైంది. కంపెనీలకు వడ్డీ భారం తీవ్రమైపోయింది. అనేక పరిస్థితులు కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయిప్పుడు. ఐరోపా దేశాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. అక్కడ కూడా వడ్డీరేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడానికి ఇవన్నీ కూడా కారణంగానే నిలుస్తున్నాయి మరి.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం (31.1 గ్రాములు) సుమారు 2,000 డాలర్ల దగ్గర కదలాడుతోంది. ఇది మరింతగా పెరగవచ్చనే భయాలున్నాయి. ఎందుకంటే అమెరికాలో బ్యాంకుల అనిశ్చితి, బాండ్ ఈల్డ్స్ తగ్గిపోవడం, మాంద్యం భయాలు, ముడి చమురు ధరలు ఏడాదిన్నర కనిష్ఠానికి పడిపోవడం వంటి వాటితో పెద్ద ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంవైపు మళ్లిస్తున్నారు. నిజానికి అనిశ్చిత పరిస్థితుల్లో బంగారాన్ని ఓ హెడ్జింగ్ సాధనంగా ఉపయోగించడం సాధారణమే. సురక్షిత పెట్టుబడి సాధనం కావడంతోనే గోల్డ్కు అంత క్రేజ్. మొత్తానికి అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పటికైనా వడ్డీరేట్ల విషయంలో కాస్త వెనక్కి తగ్గితేనే పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి. లేకపోతే పసిడి ధరలకు కళ్లెం వేయడం కష్టమే. 2020 ఆగస్టులో ఔన్స్ గోల్డ్ రేటు రికార్డుస్థాయిలో 2,035 డాలర్లదాకా వెళ్లింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయికి చేరే పరిస్థితిని కొట్టిపారేయలేమనే చెప్పాలి.
బంగారం ధరలు ఇంతలా పెరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే.. ఎంత వేగంగా పెరుగుతుందో.. అంతే వేగంగా పడిపోయే స్వభావం కూడా పుత్తడికి ఉంటుంది. అందుకే భారీ పెట్టుబడులు ఇప్పుడు సరైనవి కావనే చెప్పవచ్చు. అయితే కేవలం పెట్టుబడి ఆలోచన ఉన్నవాళ్లు కరెక్షన్స్లో గోల్డ్ను తమ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. సాధారణంగా మనం చేసే ప్రతీ వంద రూపాయల పొదుపులో రూ.5-10 వరకూ పుత్తడికి కేటాయించవచ్చు. అంతకుమించి చేయకపోవడమే మంచిది. అదికూడా భౌతిక బంగారం (నగలు, నాణేలు, బిస్కట్లు) కాకుండా ఆర్బీఐ సావరిన్ బాండ్స్, ఈటీఎఫ్స్ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇక రాబోయే పెండ్లిళ్ల సీజన్లో బంగారం రేట్లు తగ్గుతాయా?.. అనే ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేం. ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా అంశాలు బంగారాన్ని ప్రభావితం చేస్తున్న తరుణంలో అంచనా కష్టమే. అయితే పెద్దఎత్తున పసిడి అవసరం ఉన్నవాళ్లు మెల్లిగా, దశలవారీగా కొనుక్కోవడం ఒకటే చేయగలిగిన పని.
-నాగేంద్రసాయి కుందవరం
ఏప్రిల్ 1 నుంచి గోల్డ్ హాల్మార్కింగ్ నిబంధనలు మారనున్నాయి. బంగారు నగల స్వచ్ఛతను తెలుసుకోవడానికి కొనుగోలుదారులకు ఈ గోల్డ్ హాల్మార్కింగే ప్రామాణికం అన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల మొదలు అన్ని బంగారు ఆభరణాలు, ఇతర కళాఖండాలకు 6 అంకెల అల్ఫాన్యూమరిక్ హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ) నెంబర్ తప్పనిసరి. ఈ నెంబర్.. సదరు నగల స్వచ్ఛత పరిశీలనకు, దాని అమ్మకందారుల చిరునామాను కనిపెట్టడానికి కూడా ఉపకరిస్తుంది. ప్రస్తుతం 4 అంకెల హెచ్యూఐడీ, లోగోనే ఉంటుండగా, దీనివల్ల కస్టమర్లు కేవలం నగల స్వచ్ఛతనే తెలుసుకోగలుగుతున్నారు.
ఏదైనా మోసం జరిగితే అమ్మినవారి వద్దకు వెళ్లలేకపోతున్నారు. దీంతోనే 6 అంకెల హెచ్యూఐడీని తెస్తుండగా, ఇందులో ప్రతీ వ్యాపారి కోడ్ ఉంటుందని, దానివల్ల కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోరని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ కమిషనర్ నిధి ఖారే అన్నారు. కాబట్టి కొనుగోలుదారులు బంగారాన్ని కొనేటప్పుడు దానిపై ఈ 6 అంకెల హెచ్యూఐడీ ఉందా?.. లేదా?.. అన్నది చూసుకోవాలని, ఇకపై ఉన్నదే కొనాలని సూచించారు.
అప్పుడే భవిష్యత్తులో ఎప్పుడైనాసరే కొన్నప్పుడు చెప్పిన స్వచ్ఛత లేదని తెలిస్తే వ్యాపారి దగ్గర బాధితులు నష్టపరిహారం వసూలు చేయగలరన్నారు. కాగా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ‘బీఐఎస్ కేర్ యాప్’ పేరిట ఓ స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను కూడా తీసుకొచ్చింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని ఐఎస్ఐ, హాల్మార్క్ నమోదిత బంగారు, వెండి ఆభరణాలను ట్రాక్ చేయవచ్చు. రియల్ టైంలో మీ నగల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఇదిలావుంటే 2000వ సంవత్సరం నుంచి దేశంలో బంగారం నగలపై హాల్మార్కింగ్ మొదలైంది. ప్రస్తుతం రోజూ 3 లక్షలకుపైగా బంగారు ఉత్పత్తులకు హాల్మార్కింగ్ జరుగుతున్నదని సంబంధిత అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఏడాది క్రితం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ పుత్తడి ధర రూ.51,500. ఇప్పుడదే ఏకంగా రూ.61,200 పలుకుతున్నది. అంటే ఈ ఏడాది కాలంలో దాదాపు రూ.10వేలు పెరిగిందన్నమాట. అయితే ఇదే వ్యవధిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,990 డాలర్ల నుంచి 1,650 డాలర్లకు దిగొచ్చింది. కానీ మన కరెన్సీ.. రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చితే రూ.75 నుంచి రూ.83కి చేరింది. దీంతో దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెద్దగా తగ్గలేదు.
– నాగేంద్ర సాయి కుందవరం