న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 1: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో అతి విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో ధరలు మరింత తగ్గుతాయని ఎదురుచూసిన సామాన్యుడికి తొలిరేజే షాకిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు భగ్గుమన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.44,700కి చేరుకున్నది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ళ మద్దతుకు తోడు గ్లోబల్ మార్కెట్లో భారీగా పుంజుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,070 అధికమై రూ. 63,250 పలికింది. హైదరాబాద్లో తులం పసిడి ధర రూ.600 అధికమై రూ.45,440కి చేరుకోగా, వెండి రూ.1,400 ఎగబాకి రూ.68,700కి చేరుకున్నది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,719 డాలర్లు పలుకగా, వెండి 24,48 డాలర్లుగా ఉన్నది.