Gold- Silver Rates | మరో పది రోజుల్లో దంతేరాస్ పర్వదినం రానున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.750 వృద్ధి చెంది మరో జీవిత కాల గరిష్టం రూ.80,650 పలికింది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.79,900 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ధర సైతం ఒకే రోజు రూ.5000 పుంజుకుని పైపైకి దూసుకెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కిలో వెండి ధర రూ.5000 వృద్ధితో రూ.99,500లకు చేరుకున్నది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,500 వద్ద ముగిసింది.
పారిశ్రామిక రంగాల నుంచి డిమాండ్ రావడంతోపాటు బంగారానికి గిరాకీ పెరగడంతో వెండి ధర కూడా చుక్కలనంటుతోంది. ఇక 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర సైతం రూ.750 పెరిగి రూ.80,250 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ కాంట్రాక్ట్స్ డెలివరీ తులం బంగారం ధర రూ.493 వృద్ధి చెంది రూ.78,340 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.2,822 పెరిగి రూ.98,224లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 34 డాలర్ల మార్కుకు చేరుకున్నది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 2744.30 డాలర్లు పలికింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్లే ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారని ఇన్వెస్టర్లు చెబుతున్నారు.