Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధగధగమని మెరుస్తున్నది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.300 పెరిగి రూ.62 వేలకు చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ. 61,700 వద్ద ముగిసింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి ఆప్షన్గా నిలవడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా డాలర్ విలువ పెరుగుతున్నా, యూఎస్ ట్రెజరీ బాండ్ల ధరలు ఇటీవల గరిష్ట స్థాయికి చేరుకుని స్థిరంగా ఉన్నాయి.
మరోవైపు కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.75,000 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం 1988 డాలర్లు, ఔన్స్ వెండి 23.05 డాలర్లు పలుకుతున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లోనూ బంగారం తులం (24 క్యారట్స్) ధర గురువారం రూ.152 పెరిగి రూ.60,978 వద్ద స్థిర పడింది. న్యూయార్క్లో ఔన్స్ బంగారం 0.27 శాతం పెరిగి 2000.30 డాలర్ల వద్ద స్థిర పడింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.510 పెరిగి రూ.62,200, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.450 పెరుగుదలతో రూ.57 వేల మార్క్ వద్ద నిలిచింది.
హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ముంబైల్లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.160 పెరిగి రూ.61,960 వద్ద, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.150 పెరిగి రూ.56,800 వద్ద స్థిర పడింది.