Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బుల్లిష్ ధోరణి నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర (24 క్యారెట్స్) గురువారం ఒక్కరోజే భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో తులం (24 క్యారెట్స్) బంగారం ధర రూ.1,130 పెరిగి రూ.62,950 వద్దకు దూసుకెళ్లిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం ఢిల్లీలో తులం బంగారం రూ.61,820 పలికింది. మరోవైపు, కిలో వెండి ధర కూడా రూ.2350 పుంజుకుని రూ.77,400 వద్ద స్థిర పడింది. బుధవారం కిలో వెండి ధర రూ.75,050 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2032 డాలర్లు, ఔన్స్ వెండి ధర 24 డాలర్లు పలికింది. బుధవారం ధరతో పోలిస్తే గురువారం ఔన్స్ బంగారం 51 డాలర్లు పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. వడ్డీరేట్ల పెంపు క్యాంపెయిన్ ముగిసిందని, వచ్చే ఏడాది నుంచి వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతమైంది. కామెక్స్ గోల్డ్ ధర 2.5 శాతం పెరిగిందన్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం నేపథ్యంలో అమెరికా ట్రెజరీ బాండ్లు, డాలర్ ఇండెక్స్ ధరలు పడిపోవడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం తులం (24 క్యారెట్స్) ధర రూ.1276 పెరిగి రూ.62,475 పలికింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి గోల్డ్ కాంట్రాక్ట్స్ డెలివరీ ధర 2.09 శాతం రూ.1,276 పుంజుకుని రూ.62,475 వద్ద నిలిచింది. న్యూయార్క్లో ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 2.51 శాతం పెరిగి 2047.40 డాలర్ల వద్ద నిలిచింది.