ముంబై, జూలై 20: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) దేశంలో బంగారం ఆభరణాలకు డిమాండ్ గతంతో పోల్చితే 5 శాతం పడిపోయే వీలుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన కస్టమ్స్ సుంకాల భారంతో ఈసారి పసిడి నగలకు ఆదరణ 550 టన్నులకే పరిమితం కావచ్చన్నది. నిరుడు 580 టన్నులుగా ఉందని గుర్తుచేసింది. గత నెల 30న బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతానికి మోదీ సర్కారు పెంచిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గోల్డ్ జ్యుయెల్లరీ రిటైలర్ల రెవిన్యూ, లాభాల్లో ఎటువంటి పెరుగుదలను నోచుకోకపోవచ్చని పేర్కొన్నది. ఇప్పటికే దిగుమతి సుంకాల భారంతో పడిపోయిన కొనుగోళ్లను పెంచుకోవడానికి.. ఆయా సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ఇవ్వాల్సి వస్తున్నదని, ఇలా కస్టమ్స్ సుంకాన్ని ఇంకా పెంచితే అమ్మకాలపై ఆ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది.