హైదరాబాద్, అక్టోబర్ 14: బంగారం మళ్లీ భగ్గుమన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కాసారిగా పుంజుకున్నాయి. ఇజ్రాయిల్-గాజాల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకున్నాయి.
శుక్రవారం ఒకేరోజు గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఏకంగా 60 డాలర్లకు పైగా పెరగంతో దేశీయంగా ధరలు పెరిగాయి. హైదరాబాద్లో తులం బంగారం ధర మళ్లీ రూ.60 వేలు దాటింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,530 అధికమై రూ.58,910 నుంచి రూ.60,440కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.1,400 అందుకొని రూ.55,400కి చేరుకున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. కానీ, వెండి యథాతథంగా కొనసాగుతున్నది. కిలో వెండి ధర రూ.77 వేలుగా ఉన్నది.