ముంబై/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: మదుపరులకు భవిష్యత్తు అంతా బంగారుమయమే. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిణామాలు.. పుత్తడిపై పెట్టుబడులను దీర్ఘకాలంలో ఆకర్షణీయం చేస్తాయంటున్నారు మరి. పసిడి వంటి విలువైన లోహాలపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంవోఎఫ్ఎస్ఎల్) తాజాగా ఇచ్చిన త్రైమాసిక నివేదిక ప్రకారం.. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మున్ముందు పెద్ద ఎత్తున రాబడులను ఇవ్వగలవని తెలుస్తున్నది.
అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న అమెరికా డాలర్పట్ల చాలా దేశాలు విముఖత ప్రదర్శిస్తున్నాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ విలువ హెచ్చుతగ్గులతోపాటు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరి కూడా ఇందుకు కారణంగానే నిలుస్తున్నది. ఈ క్రమంలోనే డాలర్కు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో లావాదేవీలను జరిపేందుకు మెజారిటీ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అలాగే పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు.. అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా అత్యధికులకు ఇప్పుడు బంగారమే కనిపిస్తున్నది. దీంతో గోల్డ్ లాంగ్-టర్మ్ ఔట్లుక్ బుల్లీష్గానే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ తమ రిపోర్టులో అంటున్నది. ఈ ఏడాది ఆరంభంలో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఏకంగా 5,000 డాలర్లను అధిగమించేసింది. ఈ క్రమంలో నిర్మాణాత్మక రీప్రైసింగ్ దశలోకి పుత్తడి చేరిందని మోతీలాల్ ఓస్వాల్ చెప్తున్నది. ఈ పరిణామం సమీప భవిష్యత్తులో మరింతగా ధరలు పెరుగుతాయన్నదాన్ని సూచిస్తున్నదని అంటున్నది.
వచ్చే ఏడాది కాలంలో అమెరికా ప్రధాన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్సేంజీ కొమెక్స్లో ఔన్స్ గోల్డ్ రేటు 6,000 డాలర్లను తాకవచ్చని మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తమ నివేదికలో అంచనా వేసింది. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం విలువ రూ.1.85 లక్షలు పలుకవచ్చంటున్నది. ఇక రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఔన్స్ గోల్డ్ వ్యాల్యూ 7,500 డాలర్లకు వెళ్లగలదన్న అంచనాలు కూడా ఉండటం గమనార్హం. కాగా, గత నెల 29న భారతీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000 పలికిన విషయం తెలిసిందే. వెండి ధర సైతం ఆల్టైమ్ హై రికార్డుకెక్కి కిలో రూ.4,04, 500 పలికింది.
ఇక జనవరి 30న బంగారం రేటు రూ.14,000 ఎగబాకితే.. 31న వెండి ధర రూ.72,500 ఎగిసింది. ఇప్పుడు ధరలు కాస్త తగ్గుముఖం పట్టినా.. మార్కెట్లో సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారులకు మాత్రం ఇంకా అందనంత ఎత్తులోనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లతోపాటు ఇతర పెట్టుబడి సాధనాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో మెజారిటీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణార్థం.. పసిడి వైపునకే పరుగులు తీస్తున్నారు మరి.
అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా ఇతర ప్రధాన దేశాల సెంట్రల్ బ్యాంకులు.. గోల్డ్ రిజర్వులను క్రమేణా పెంచుకుంటూపోతున్నాయి. వరుసగా గత నాలుగేండ్లలో సెంట్రల్ బ్యాంకులు ఏటా వెయ్యి టన్నుల మేర తమ పుత్తడి నిల్వలను పెంచుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీనికితోడు బంగారం ఉత్పాదక దేశాల్లో అనుకూల పరిస్థితులు లేకపోవడం కూడా ధరలను ఎగదోస్తున్నదని విశ్లేషకులు వివరిస్తున్నారు.
దేశీయ విపణిలో గురువారం పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,300 పడిపోయి రూ.1,62,900 వద్ద స్థిరపడింది. కిలో వెండి రేటు రూ.7,400 క్షీణించి రూ.2,70,500 దగ్గర నిలిచింది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలే ఇందుకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం పుత్తడి రూ.800 దిగి రూ.1,47,600గా ట్రేడైంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 5,176.21 డాలర్లుగా, సిల్వర్ 87.28 డాలర్లుగా ఉన్నాయి.
దీర్ఘకాలంలో చూసినైట్టెతే బంగారంపై పెట్టుబడులకు ఢోకా లేదు. అంతర్జాతీయంగా డాలర్ ఆధారిత ఆస్తులు క్రమేణా తరిగిపోతున్నాయి. అలాగే భౌతిక రూపంలో బంగారం సరఫరా పరిమితంగానే ఉండగలదు. దీంతో డిమాండ్కు తగ్గట్టుగా లేక మార్కెట్లో ధరలు పైస్థాయిల్లోనే కదలాడగలవు. ఔన్స్ గోల్డ్ 5,000 డాలర్లుగానే ట్రేడయ్యే వీలున్నది.
-నవనీత్ దమానీ, ఎంవోఎఫ్ఎస్ఎల్ రిసెర్చ్