న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పసిడి ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా అధికమయ్యాయి. ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్ళు పెరగడం, గ్లోబల్ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయని బులియన్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర మంగళవారం ఏకంగా రూ.1,000 అధికమై రూ.51 వేలు దాటి రూ.51,710 వద్ద నిలిచింది. అంతకుముందు ఇది రూ.50,740గా ఉన్నది. గత రెండు రోజులుగా భారీగా పుంజుకుంటున్న వెండి ఏకంగా రూ.4 వేల వరకు అధికమైంది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో వెండి ఏకంగా రూ.3,790 ఎగబాకి రూ.62 వేలు పలికింది. పెరగకముందు ఇది రూ.58,200గా ఉన్నది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.51,660కి, 22 క్యారెట్ల ధర రూ.500 అధికమై రూ.47,350కి చేరుకున్నది. రూ.4,200 పెరిగిన కిలో వెండి రూ.66,700కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే ఔన్స్ గోల్డ్ ధర 1,710 డాలర్లు పలుకగా, వెండి 20.99 డాలర్లుగా నమోదైంది. గత మార్చి నెల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు డాలర్ ఇండెక్స్, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పడిపోవడం మరింత పెరగడానికి దోహదం చేశాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.