Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) రూ.265 తగ్గి రూ.61,585 పలికింది. మంగళవారం ట్రేడింగ్లో తులం బంగారం ధర రూ.61,850 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2033 డాలర్ల వద్ద ట్రేడయింది. ఆసియా మార్కెట్లలోనూ తక్కువ ధర పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.120 పెరిగి రూ.77,800 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 25.88 డాలర్లకు చేరుకున్నది.
ఫ్యూచర్ మార్కెట్లోనూ పసిడి ధర పతనమైంది. డిమాండ్ తక్కువగా ఉండటంతో మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం జూన్ డెలివరీ ధర రూ.129 తగ్గి రూ.61,290 పలికింది. గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 0.25 శాతం తగ్గి 2037.80 డాలర్ల వద్ద నిలిచింది.
ఇదిలా ఉంటే, మార్చి త్రైమాసికంలో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు 228 టన్నుల బంగారం కొనుగోలు చేశాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. గత మూడు నెలల్లో బంగారం కొనుగోలు చేసిన దేశాల్లో భారత్, చైనా మొదటి స్థానాల్లో నిలిచాయి. అమెరికా బాండ్ల విలువ పతనం కావడంతోపాటు వడ్డీరేట్లు పెరగడం వల్ల బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్నది.
మార్చి నెలాఖరు నాటికి సింగపూర్ 222.41 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. చైనా బంగారం నిల్వలు 2068.36 టన్నులకు చేరాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మార్చి నెలాఖరు నాటికి 794.62 టన్నుల బంగారం నిల్వలు కలిగి ఉంది.