భారతీయులకు బంగారంపై ఎంత మోజుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధరలతో సంబంధం లేకుండా పసిడిపై హద్దుల్లేని మక్కువను ప్రదర్శిస్తారు. నగలు, నాణేలు ఇలా.. ఏ రూపంలో ఉన్నా పుత్తడి అంటే ప్రేమే. ఇప్పుడు గోల్డ్ బాండ్లపైనా అది కనిపిస్తున్నది. ఓవైపు రికార్డు స్థాయిలో రేట్లు పెరిగినా గత నెలలో గట్టిగానే కొనేశారు మరి. ఫిబ్రవరిలో రూ.8,000 కోట్ల విలువైన పసిడి బాండ్లను దేశీయ ఇన్వెస్టర్లు కొన్నట్టు తేలింది.
Sovereign Gold Bond | ముంబై, మార్చి 6: దేశంలో గోల్డ్ బాండ్లు హాట్ కేకులను తలపిస్తున్నాయి. సహజంగానే బంగారంపై ఇష్టాన్ని కనబర్చే భారతీయులు.. ట్రెండ్కు తగ్గట్టు రూటు మార్చేశారు. పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో అంతా ఇప్పుడు గోల్డ్ బాండ్లపై దృష్టి పెడుతున్నారు మరి. గత నెలలో అమ్ముడుపోయిన పసిడి బాండ్లే ఇందుకు నిదర్శనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా వివరాల ప్రకారం ఫిబ్రవరిలో భారతీయులు 12.78 టన్నులకు సమానమైన సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను కొన్నారు. వీటి విలువ రూ.8,008.38 కోట్లు (966 మిలియన్ డాలర్లు). ఇప్పటిదాకా ఇదే అత్యంత గరిష్ఠమని ఆర్బీఐ ప్రకటించింది. సరిగ్గా 8 ఏండ్ల 2 నెలల క్రితం (2015 నవంబర్ 30) ఆర్బీఐ భారత్లో గోల్డ్ బాండ్లను పరిచయం చేసింది. అప్పట్నుంచి చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విక్రయాల విలువే ఎక్కువ.
దేశంలో ఆల్టైమ్ హై శ్రేణిలో బంగారం ధరలు కదలాడుతున్నాయి. ఇక స్టాక్ మార్కె ట్లూ మునుపెన్నడూలేని స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నది చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ గోల్డ్ బాండ్లను కొనేందుకు దేశీయ మదుపరులు పెద్ద ఎత్తునే ఆసక్తి కనబర్చారు. గత నెల ఆర్బీఐ జారీ చేసిన ఎస్జీబీల ధర రికార్డు స్థాయిలో గ్రాముకు రూ.6,263గా ఉన్నది. అయినా డిమాండ్ మాత్రం తగ్గకపోవడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 44.33 టన్నుల (రూ.27,032 కోట్లు)కు సమానమైన గోల్డ్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి విక్రయాలు జరుగడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆర్బీఐ జారీ చేసిన ఎస్జీబీల్లో ఈసారి అమ్ముడుపోయిన వాటి వాటా 31 శాతంగా ఉన్నది. గడిచిన ఎనిమిదేండ్లలో 141.88 టన్నుల (రూ.71,284 కోట్లు)కు సమానమైన గోల్డ్ బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది. తొలిసారి 2015 నవంబర్లో విక్రయించిన గోల్డ్ బాండ్లు 913 కిలోలు. రెండోసారి 2016 ఫిబ్రవరిలో 2.86 టన్నులకు సమానమైన గోల్డ్ బాండ్లను అమ్మింది. వీటిల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు లాభం వరుసగా 128 శాతం, 141 శాతంగా ఉండటం గమనార్హం. 2015లో ఇష్యూ ధర గ్రాము రూ.2,684గా ఉన్నది. ఇప్పుడది రూ.6,132కు చేరింది. 2016లో ఇష్యూ ధర రూ.2,600. ప్రస్తుతం రూ.6,271 వస్తున్నది.
నగలు, కడ్డీలు, నాణేలు తదితర భౌతిక బంగారానికి చట్టబద్ధ పత్ర రూపమే ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ). కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని జారీ చేస్తుంది. కాబట్టి అత్యంత సురక్షితమైన పెట్టుబడులుగా వీటిని పేర్కొనవచ్చు. ఈ బాండ్లకు 8 ఏండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయినప్పటికీ ఐదేండ్ల తర్వాత నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుంటుంది. సెకండరీ మార్కెట్లో అప్పటి గోల్డ్ రేటు ప్రకారం తిరిగి అమ్ముకోవచ్చు. బ్యాంకులు, కొన్ని పోస్టాఫీసుల ద్వారా ఈ బాండ్లను కొనుక్కోవచ్చు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు కూడా విక్రయిస్తాయి. ఇక బాండ్ల ధరను వాటిని జారీ చేయడానికి ముందున్న 3 రోజుల 24 క్యారెట్ బంగారం ముగింపు ధర (భారతీయ బులియన్, జ్యుయెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) లిమిటెడ్ నిర్దేశించిన రేట్లు)ల సగటు ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఎస్జీబీ స్కీంతో 2.5 శాతం వార్షిక కూపన్ వడ్డీరేటు ఉంటుంది. మదుపరులకు ఆర్నెళ్లకోసారి దీని ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. కాగా, ఇండివీడ్యువల్స్, హిందూ అవిభాజ్య కుటుంబాలకైతే గ్రాము నుంచి 4 కిలోలదాకా, సంస్థలు-ట్రస్టులకైతే గరిష్ఠంగా 20 కిలోల వరకు పెట్టుబడికి అవకాశముంటుంది. బాండ్కున్న మార్కెట్ విలువలో 75 శాతం వరకు రుణంగా పొందవచ్చు. బాండ్లను వాటి పూర్తి కాలపరిమితైన ఎనిమిదేండ్లూ ఉంచుకుంటే ఆ తర్వాత వచ్చే దానిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. అయితే ఈ 8 ఏండ్ల కాలంలో వాయిదాల్లో పొందే వడ్డీ ఆదాయంపై మాత్రం పన్ను పడుతుంది. మీమీ ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం ఇది వర్తిస్తుంది.
దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం మరింత పెరిగి మరో ఆల్టైమ్ హైని తాకాయి. ఢిల్లీలో 24 క్యారెట్ పుత్తడి ధర రూ.150 అందుకుని రూ.65,150గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్ జోష్కు దేశీయంగా పెండ్లిళ్ల సీజన్ తోడవడంతో రేట్లు క్రమేణా పుంజుకుంటున్నాయి. హైదరాబాద్లోనూ రూ.280 ఎగిసి రూ.65,130కి చేరింది. 22 క్యారెట్ గోల్డ్ రూ.250 ఎగబాకి రూ.59,700లుగా ఉన్నది. ఇక కిలో వెండి ధర ఢిల్లీలో రూ.400 పుంజుకొని రూ.74,500లను తాకింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రికార్డు స్థాయిలో 2,122 డాలర్లు పలుకగా, ఫ్యూచర్ మార్కెట్లో 2,155 డాలర్లుగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం.
గోల్డ్ బాండ్లలో పూర్తికాల పెట్టుబడులతో వచ్చే రాబడిపై పన్నులు లేకపోవడం, ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో లభించేదానికన్నా ఆకర్షణీయ ప్రయోజనాలు ఉండటం, రిస్క్ తక్కువ కావడం, నానాటికీ పెరుగుతూపోతున్న బంగారం ధరలు వంటివి ఎస్జీబీలకు డిమాండ్ను పెంచుతున్నాయి.
మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు ఎంతో అనువైనవని చెప్పవచ్చు. పెరుగుతున్న బంగారం ధరలతో మూలధనం విలువ కూడా పెరుగుతూపోతుంటుంది. వడ్డీ ప్రయోజనమూ బాగుంటుంది.