Gold Rates | పండుగలు, శుభకార్యాలు, పెండ్లిండ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ట్రెండ్గా మారింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయ్యాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత 75 ఏండ్లలో బంగారం, వెండి చాలా ఖర్చుతో కూడిన లోహాలుగా మారాయి. 1947లో తులం (24 క్యారట్లు) బంగారం ధర కేవలం రూ.88.62. ఇప్పుడు రూ.52 వేల పై చిలుకు పలుకుతున్నది. నాడు (15-08-1947 కి ముందు) కిలో వెండి ధర కేవలం రూ.107. కానీ ఇప్పుడు రూ.58 వేల పై మాటే.
గత 75 ఏండ్లలో బంగారం ధర 590 రెట్లు పెరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర రూ.88.62. కానీ ఇప్పుడు అదే బంగారం రూ.52,461లకు చేరుకున్నది. దీని ప్రకారం తులం బంగారం 590 రెట్లు మరింత పిరంగా మారింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి ధరతో పోలిస్తే ఇప్పుడు వెండిపై 544 రెట్లు రిటర్న్స్ లభిస్తున్నాయి. 1947లో కిలో వెండి ధర రూ.107. అదే ఇప్పుడు రూ.58,352 పలుకుతున్నది.
ప్రస్తుతం బులియన్ మార్కెట్పైనా.. అంతర్జాతీయ మార్కెట్పైనా ఉన్న ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా తులం బంగారం ధర రూ.54 వేలు దాటొచ్చు. అధిక ధరల ప్రభావం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో మరోమారు బంగారం కాస్ట్లీగా మారే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతియేటా భారతీయులు 700-800 టన్నుల మధ్య బంగారం వాడుతుంటారు. దేశంలో ఒక టన్ను బంగారం ఉత్పత్తవుతుంది. మిగతా అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కరోనా వేళ 2020లో 344.2 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకున్నది. ఇది 2019తో పోలిస్తే 47 శాతం తక్కువ. 2019లో 646.8 టన్నుల బంగారం దిగుమతైంది.