న్యూఢిల్లీ, మార్చి 13 : బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, వడ్డీరేట్ల తగ్గింపుపై అనిశ్చిత స్థితి నెలకొనడంతో ధరలు నాలుగు శాతం వరకు పడిపోయాయి. శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.2.65 లక్షలకు దిగిరాగా, బంగారం ధర రూ.1.63 లక్షలకు తగ్గిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి రూ.11 వేలు లేదా 3.97 శాతం తగ్గి రూ.2,65,500కు దిగొచ్చింది. గురువారం ఇది రూ.2,76,500గా ఉన్నది. వెండితోపాటు బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నది.
99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,000 లేదా 1.21 శాతం తగ్గి రూ.1,63,200గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1,65,200గా నమోదైంది. ఇటు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,530 తగ్గి రూ.1,60,690కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,400 తగ్గి రూ.1,47,300కు దిగింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మరింత బలోపేతం కావడం, రిజర్వు బ్యాంక్ వచ్చే ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ రీసర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. వీటికి తోడు క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమనడం, పశ్చిమాసియాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతుండటం కారణమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ఒక్క శాతం తగ్గి 83.14 డాలర్లకు పరిమితం కాగా, బంగారం స్వల్పంగా పెరిగి 5,088 డాలర్లు పలికింది.