Gold Price | న్యూఢిల్లీ, మార్చి 22: బంగారం ధరలు పడుతూ.. లేస్తూ.. సాగుతున్నాయి. గురువారం రికార్డు స్థాయికి చేరిన రేట్లు.. శుక్రవారం అక్కడి నుంచి దిగజారాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ పుత్తడి 10 గ్రాములు రూ.875 తగ్గి రూ.66,575 వద్ద స్థిరపడింది. హైదరాబాద్లోనూ తులం రూ.490 పడిపోయి రూ.66,930 వద్ద నిలిచింది.
దేశ రాజధానిలో మునుపెన్నడూ లేనివిధంగా గురువారం తులం పసిడి ధర రూ.1,130 ఎగబాకి రూ.67,450 వద్దకు చేరిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం 35 డాలర్లు దిగి 2,167 వద్ద ఉన్నది. ఇక వెండి విషయానికొస్తే.. ఢిల్లీలో కిలో ధర రూ.760 పతనమై రూ.76,990కు పరిమితమైంది. హైదరాబాద్లో ఏకంగా రూ.2000 క్షీణించి రూ.76,500లకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్సు 24.45 డాలర్లుగానే ఉన్నది. అటు ఫ్యూచర్ మార్కెట్లోనూ పసిడికి స్వల్పంగా ఆదరణ పడిపోయింది.