న్యూఢిల్లీ, జూన్ 25: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతకొద్ది నెలలుగా ఆకాశమే హద్దు అన్నట్టు దూసుకుపోయిన రేట్లు.. ఇప్పుడు అంతే వేగంతో దిగొస్తున్నాయి. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గడిచిన దశాబ్దంలోనే ఎన్నడూలేనంతగా గోల్డ్ విలువ క్షీణించింది. ఇప్పటిదాకా 12 శాతం రేట్లు పడిపోయాయి. 2016 డిసెంబర్ నుంచి చూస్తే.. 3 నెలల వ్యవధిలో ఈ స్థాయిలో ధరల క్షీణత ఇదే. సిల్వర్ వాల్యూ సైతం నాలుగేండ్లలో భారీ పతనాన్ని చవిచూసింది. 17.6 శాతం తగ్గింది. 2022 జూన్ తర్వాత ఇప్పుడే ఇంతటి క్షీణత అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నిజానికి వరుసగా 15 నెలలు పరుగులు పెట్టిన పుత్తడి, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్ గేర్లోకి వెళ్లడంతో మార్కెట్లోనూ స్తబ్ధత నెలకొన్నది. కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారు మరి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరల పతనం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి 28న ఔన్స్ గోల్డ్ ఆల్టైమ్ హై రికార్డును సృష్టిస్తూ 5,417 డాలర్లు పలికింది. సిల్వర్ తొలిసారి 117 డాలర్లుగా నమోదైంది. అయితే ఇప్పుడున్న ధరలతో పోల్చితే బంగారం 24 శాతం, వెండి దాదాపు 47 శాతం తగ్గాయి. ప్రస్తుత ట్రెండ్నుబట్టి ఇంకా తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారతీయ మార్కెట్లోనూ రేట్లు మరింత దిగివస్తాయన్న అభిప్రాయాలు మార్కెట్ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.
అమెరికా డాలర్ బలపడటం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగడం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు.. బంగారం, వెండి ధరల్ని కిందికి లాగుతున్నాయని మెజారిటీ మార్కెట్ విశ్లేషకుల మాట. ఇన్నాళ్లూ తమ పెట్టుబడులకు రక్షణ కవచంగా గోల్డ్, సిల్వర్ను భావించిన మదుపర్లు.. వాటిని ఎడాపెడా కొనేశారు. అయితే తిరిగి అమ్మకాలకు దిగుతుండటం కూడా డిమాండ్ను దెబ్బ తీస్తున్నదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక స్టాక్ మార్కెట్లలో టెక్నాలజీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సైతం గోల్డ్, సిల్వర్ రేట్లను దిగజార్చుతున్నాయని చెప్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలూ డౌన్ ట్రెండ్కు దారితీస్తున్నాయి. ఇదిలావుంటే అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం కూడా గోల్డ్, సిల్వర్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నది.
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభించిన సంగతి విదితమే. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో క్రూడాయిల్, గ్యాస్ ఉత్పత్తికి బ్రేకులుపడ్డాయి. అందుకే డిమాండ్కు తగ్గ సరఫరా లేక రేట్లు పరుగులు పెట్టాయి. అయితే అమెరికా-ఇరాన్ డీల్.. పరిస్థితుల్ని కొంతమేర అదుపులోకి తెచ్చాయి. దీంతో ముడి చమురు రేట్లూ దిగువముఖం పట్టాయి. ఫలితంగా అధిక ఇంధన ధరలతో ద్రవ్యోల్బణం భయాల మధ్య బంగారం, వెండి కొనుగోలు కోసం ఎగబడ్డ మదుపర్లు.. ఒక్కసారిగా వాటిని అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది కూడా ధరల క్షీణతకు కారణమేనన్న అభిప్రాయాలున్నాయి. గల్ఫ్ వార్కు ముగింపు కార్డుపడితే మార్కెట్లో పెద్ద కరెక్షనే ఉంటుందన్న అంచనాలూ వస్తుండటం గమనార్హం.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతున్నది. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ తులం పుత్తడి రేటు రూ.7,000 పడిపోగా, కిలో వెండి విలువ రూ.19,500 క్షీణించింది. గురువారం ఢిల్లీలో పసిడి ధర రూ.2,800 దిగి రూ.1,45,300గా ఉన్నది. అలాగే వెండి రేటు కిలో రూ.5,000 పడిపోయి రూ.2, 26,000గా నమోదైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ గోల్డ్ రూ.1,450 తగ్గి రూ.1,29, 550 వద్ద నిలిచింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 21.15 డాలర్లు క్షీణించి 3,978.06 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 57.10 డాలర్లుగా ట్రేడైంది.