హైదరాబాద్, జనవరి 24(బిజినెస్ బ్యూరో):చౌక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్ తాజాగా హైదరాబాద్లో తన విమాన సేవలు ప్రారంభించింది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి గోవాకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. హైదరాబాద్లో మధ్యాహ్నాం 12.30 గంటలకు బయలుదేరనున్న క్యూపీ 1415 విమాన సర్వీసు గోవాకు 1.45 గంటలకు చేరుకోనున్నది. తిరిగి గోవాలో 2.20 గంటలకు బయలుదేరి హైదరాబాద్కు 3.35 గంటలకు చేరుకోనున్నది. హైదరాబాద్లో మధ్యాహ్నాం 4.15 గంటలకు బయలుదేరనున్న క్యూపీ 1418 సర్వీసు బెంగళూరుకు సాయంత్రం 5.25 గంటలకు చేరుకోనున్నది.
ఈ రూట్లలో ప్రయాణించేవారు అధికంగా ఉండటంతో రోజువారి సర్వీసులను ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ అధికారి ప్రవీణ్ ఐయర్ తెలిపారు. దీంతో కంపెనీ 13వ రూట్లో విమాన సేవలు ఆరంభించినట్లు అయిందన్నారు. అలాగే వచ్చే నెల 15 నుంచి బెంగళూరు-హైదరాబాద్-బెంగళూరుల మధ్య మరో రెండు విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించడానికి సంస్థ ఊవ్విళ్లూరుతున్నదని, ఇందుకోసం ప్రతి పదిహేను రోజులకొక నూతన విమానాన్ని జత చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ 14 విమానాలతో సేవలు అందిస్తుండగా..వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్యను 18కి పెంచుకోనున్నట్లు ప్రకటించారు.