Go First airlines | న్యూఢిల్లీ, మే 2: వాడియా గ్రూప్ చౌక విమానయాన కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తమ ఇంజిన్లు మరమ్మత్తులు లేక 50 శాతం విమానాలను నడపలేకపోవడంతో తీవ్రమైన నగదు సంక్షోభం తలెత్తిందని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దివాలా పిటిషన్ వేయాల్సి వచ్చిందని గో ఫస్ట్ సీఈవో కౌషిక్ ఖోనా చెప్పారు. ప్రాట్ అండ్ విట్నీ (పీ అండ్ డబ్ల్యూ) ఇంజిన్లు వరుసగా విఫలంకావడం, వాటిని ఆ సంస్థ మరమ్మత్తులు చేయకపోవడం, కొత్త ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో తమ మొత్తం విమానాల్లో 28 ఫ్లైట్స్ను గ్రౌండ్ చేశామని సీఈవో వివరించారు. దీంతో తాము ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామన్నారు.
దివాలా పిటిషన్ దాఖలు చేయడం దురదృష్టకరమైనప్పటికీ, కంపెనీ ప్రయోజనాల రీత్యా తప్పలేదని చెప్పారు. ఈ నెల 3, 4,5 తేదీల్లో తమ ఫ్లైట్స్ను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు గో ఫస్ట్ ప్రకటించింది. ఎన్సీఎల్టీ తమ దివాలా అప్లికేషన్ను ఆమోదించిన తర్వాత ఫ్లైట్స్ పునర్ ప్రారంభించనున్నట్టు కౌశిక్ తెలిపారు. గో ఫస్ట్లో 5,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గో ఫస్ట్ 29.1 లక్షల ప్రయాణికుల్ని తమ గమ్య స్థానాలకు చేరవేసింది. విమానమార్కెట్లో గో ఫస్ట్కు 7.8 శాతం వాటా ఉంది.
ప్రమోటర్ల పెట్టుబడి రూ. 6,500 కోట్లు
17 సంవత్సరాల నుంచి నడుస్తున్న గో ఫస్ట్లో ఇప్పటివరకూ ప్రమోటర్ వాడియా గ్రూప్ రూ. 6,500 కోట్ల వరకూ పెట్టుబడి చేసింది. గత మూడేండ్లలోనే ప్రమోటర్లు రూ. 3,200 కోట్లు నిధులు అందించారని గో ఫస్ట్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పీ అండ్ డబ్ల్యూ సరఫరా చేసిన ఇంజిన్లలో పదేపదే సమస్యలు రావడం, సర్వీసు ఒప్పందాల ప్రకారం వాటిని మరమ్మత్తు చేయకపోవడం, విడిభాగాలు ఇవ్వకపోవడంతో తమ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతున్నదని కంపెనీ వివరించింది. తొలి విడత ఇంజిన్ విడిభాగాల్ని ఏప్రిల్ 27కల్లా సరఫరా చేయమంటూ పీ అండ్ డబ్ల్యూను ఆదేశిస్తూ సింగపూర్లోని అంతర్జాతీయ వివాద పరిష్కారాల న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసిందని, అయినా అవి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్సీఎల్టీని ఆశ్రయించినట్టు గో ఫస్ట్ వెల్లడించింది. సింగపూర్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం మలి విడతగా 2023 డిసెంబర్లోపుగా ప్రాట్ అండ్ విట్నీ విడిభాగాలు ఇవ్వాల్సి ఉంటుందని, కోర్టు ఆదేశాలను ఇంజిన్ల సంస్థ పాటిస్తే ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబర్కల్లా పూర్తిస్థాయి కార్యకలాపాల్ని ప్రారంభించగలుగుతామని గో ఫస్ట్ వివరించింది.
డీజీసీఏ షోకాజ్
మూడు రోజులు విమానాల్ని రద్దు చేయాలని నిర్ణయించిన గో ఫస్ట్కు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీచేసింది. నిబంధనలను ఉల్లంఘించినందున, ఎందుకు చర్య తీసుకోకూడదో తెలియచేయాలంటూ గో ఫస్ట్కు షోకాజ్ ఇచ్చినట్టు డీజీసీఏ తెలిపింది.
ప్రయాణికుల ఆగ్రహం
గో ఫస్ట్ తమ విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్టు ఒక్క రోజు ముందుగా తెలియపర్చడం పట్ల పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ, గురు, శుక్రవారాల్లో గో ఫస్ట్ ఫ్లైట్స్ రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ట్వీట్స్ను కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు. కంపెనీ డబ్బు తిరిగి ఇచ్చినా, మరో విమానంలో ఇప్పటికిప్పుడు టికెట్ బుక్ చేయాలంటే రెండు రెట్లు పైన చెల్లించాల్సి వస్తుందని, తన సెలవు నిష్ప్రయోజనం అయిపోయిందంటూ ఒక ప్రయాణీకుడు ట్వీట్ చేశారు. ‘మే 4 నాటి నా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందంటూ ఈ మెయిల్ వచ్చింది. ఆఫీసు పనిమీద వెళ్లాలి, అదే రోజున మరో విమానంలో ప్రయాణించేలా చూడండి’ అంటూ మరోకరు వేడుకున్నారు. ‘ప్రపంచంలోనే చెత్త ఎయిర్లైన్స్ గో ఫస్ట్..ప్రయాణానికి ఒక రోజు ముందు ఫ్లైట్ రద్దు చేశారు’ అంటూ మరో ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.