హైదరాబాద్, జూన్ 26 : జీఎమ్మార్ మరో విమానాశ్రయాన్ని చేజిక్కించుకున్నది. దేశీయంగా ఇప్పటికే పలు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థ తాజాగా నాగపూర్ విమానాశ్రయం కూడా చేరింది. నాగపూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ 30 ఏండ్ల పాటు నిర్వహించనున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, ఈ ఎయిర్పోర్ట్ను వరల్డ్-క్లాస్ ఏవియేషన్ హబ్గా తీర్చనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇందుకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. జీఎమ్మార్ నాగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీఎన్ఐఏఎల్) విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాల నిమిత్తం గరిష్ఠంగా మూడు కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేయాల్సివుంటుందని పేర్కొంది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ టర్మినల్, మౌలిక సదుపాయాల అధునీకరణ, కార్గొ సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ సేవలను కూడా ఆధునీకరించనున్నది. ప్రస్తుతం జీఎమ్మార్…ఢిల్లీ, హైదరాబాద్, గోవా, నాగపూర్, బీదర్, ఇండోనేషియాలోని మెడాన్ విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది.