శంషాబాద్, సెప్టెంబర్ 1: ఆప్టీకూలర్ టెంపరేచర్-కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటెయినర్ల కోసం ఓ సర్వీస్ స్టేషన్ ఏర్పాటుకు జర్మనీకి చెందిన డోకాష్ టెంపరేచర్ సొల్యూషన్స్ సహకారం తీసుకుంటున్నట్టు బుధవారం జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లిమిటెడ్ విభాగమే ఈ జీహెచ్ఏసీ. డోకాష్ తరఫున ఈ సర్వీస్ స్టేషన్ను జీహెచ్ఏసీనే నిర్వహిస్తుంది. కాగా, ఈ సదుపాయంతో టెంపరేచర్-కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటెయినర్లకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోనే ఇక ప్రధాన కేంద్రంగా మారగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ వ్యక్తం చేశారు. దక్షిణాసియాలో ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్లకు ప్రధాన గేట్వేగా ఉన్న జీఎంఆర్ ఎయిర్పోర్టు కార్గోలో జర్మనీ డోకాష్ ఆప్టికూలర్ కంటెయినర్ స్టేషన్ ఏర్పాటు ఎంతో సంతోషకరమన్నారు.
మెట్రో రైల్ లింక్ ప్రాజెక్టులో జీఎంఆర్ పెట్టుబడులు
మెట్రో రైల్ లింక్ ప్రాజెక్టులో రూ.519.52 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జీఎంఆర్ గ్రూప్ ముందుకొచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు సులువుగా చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయం తెలిసిందే.