హైదరాబాద్, సెప్టెంబర్ 2: జీఎమ్మార్ గ్రూపు క్రమంగా రుణాలను తగ్గించుకుంటున్నది. ఇండోనేషియాలోని బొగ్గు గనుల్లో పూర్తి వాటాను విక్రయించిన మరుసటి రోజే ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న 40 శాతం వాటాను విక్రయించింది. సెబు ఇంటర్నేషనల్లో జీఎమ్మార్కు ఉన్న 40 శాతం వాటాను రూ.1,330 కోట్లకు అమ్మేసింది. ఈ విమానాశ్రయాన్ని జీఎమ్మార్-మెగావైడ్ సెబు ఎయిర్పోర్ట్ కార్పొరేషన్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
ఈ వాటా విక్రయానికి సంబంధించి జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ బీవీ, అబోయిటిజ్ ఇన్ఫ్రా క్యాపిటల్ ఇండస్ట్రీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఫిలిప్పీన్స్కు చెందిన అబోయిటిజ్ గ్రూపునకు చెందినదే ఈ అబోయిటిజ్ ఇన్ఫ్రా. అత్యధిక రిటర్నులు పంచుతున్న జీఎమ్మార్ విమానాశ్రయాల వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగానే మిగతా సంస్థల్లో ఉన్న వాటాలను విక్రయిస్తున్నట్లు జీఎమ్మార్ గ్రూపు బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు నుంచి వైదొలిగినప్పటికీ డిసెంబర్ 2026 వరకు టెక్నికల్ సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. 2014లో జీఎమ్మార్ గ్రూపు సెబు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును గెలుచుకున్నది. ప్రస్తుతం జీఎమ్మార్ గ్రూపు..ఢిల్లీ, హైదరాబాద్, బీదర్(కర్ణాటక) విమానాశ్రయాలను నిర్వహిస్తున్నది.