హైదరాబాద్, అక్టోబర్ 25: హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ వైదొలిగింది. జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తనకున్న 11 శాతం వాటాను జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్కు విక్రయించింది. ఒప్పందం విలువ 100 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా(మన కరెన్సీలో రూ.831 కోట్ల కంటే అధికం). మారిషస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థే మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జీఎమ్మార్ వాటా 63 శాతం నుంచి 74 శాతానికి చేరుకోనున్నది.
మిగతా వాటాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 13 శాతం ఉండగా, ఎయిర్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి 13 శాతం వాటా ఉన్నది. ఈ వాటా కొనుగోలు ఒప్పందం పూర్తికావడానికి 135 రోజులు పట్టవచ్చని అంచనా. ఈ సందర్భంగా జీఎమ్మార్ గ్రూపు బిజినెస్ చైర్మన్(ఎయిర్పోర్ట్స్) జీబీఎస్ రాజు మాట్లాడుతూ..విమానాశ్రయ వ్యాపారంలో తొలి నుంచి వాటాదారుడిగా ఉన్న ఎంఏహెచ్బీ వైదొలగడం కొంత బాధగా ఉన్నదని, అయినప్పటికీ ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయ నిర్వహణలో టెక్నికల్గా సేవలు అందించనున్నట్టు తెలిపారు. అలాగే జీఎమ్మార్ గ్రూపు కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గంధీ మాట్లాడుతూ..విమానాశ్రయ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో జీహెచ్ఐఏఎల్లో అదనపు వాటాను కొనుగోలు చేసినట్టు చెప్పారు.