హైదరాబాద్, జనవరి 18: జీఎమ్మార్ ఏవియేషన్ స్కూల్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. గురువారం ఇక్కడ మొదలైన వింగ్స్ ఇండియా 2024కు హాజరైన ఆయన ఆన్లైన్లో ఈ స్కూల్ను లాంచ్ చేశారు. ఎయిర్బస్ సహకారంతో జీఎమ్మార్ దీన్ని తీసుకురాగా.. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దనున్న జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటైంది.
ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (ఏఎంఈ)లో ఈ స్కూల్ అత్యుత్తమంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో జీఎమ్మార్ వ్యక్తం చేసింది. కాగా, ఇందులో 4 ఏండ్ల ఏఎంఈ కోర్సు ఉంటుంది. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ)ల గుర్తింపున్నది.
అంతేగాక దేశంలో బీ1.1, బీ2 ఏఎంఈ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ను అందిస్తున్న ఇనిస్టిట్యూషన్ కూడా ఇదేనని జీఎమ్మార్ ఏరో టెక్నిక్ అధ్యక్షుడు అశోక్ గోపీనాథ్ తెలిపారు. ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ స్పెసిఫిక్ టైప్ ట్రైనింగ్ కోర్సులతోపాటు ఎయిర్క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్క్రాఫ్ట్ కాంపోజిట్ కోర్సుల వంటి పాత తరం కోర్సులనూ అందిస్తారు. ఇందుకు సంబంధించిన శాస్త్ర, సాంకేతికతను పుస్తకాల రూపంలో ఎయిర్బస్ అందిస్తుంది. అలాగే ఎయిర్బస్ కాంపిటెన్స్ ట్రైనింగ్ (యాక్ట్)కు వీలుగా ఎగ్జామినేషన్ డాటాబేస్నూ కల్పిస్తుంది.
జీఎమ్మార్-ఇండిగో జట్టు
భారతీయ విమానయాన పరిశ్రమకు కొత్తరూపును తెచ్చేలా వ్యూహాత్మకంగా ఓ డిజిటల్ కన్సార్టియంను జీఎమ్మార్ గ్రూప్, ఇండిగో ఎయిర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు ఇక్కడ ప్రకటించాయి. కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీలు, ప్యాసింజర్ ఎక్స్పీరియన్సెస్, యావత్తు ఇండస్ట్రీ స్థిరత్వంపై ఈ కన్సార్టియం ప్రధానంగా దృష్టి పెట్టనున్నది. పరిశ్రమలో ఇన్నోవేషన్కు తొలి ప్రాధాన్యతనిస్తున్నామని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్జీకే కిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తు తరాల సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.