Smart Phone Sales | అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తొమ్మిది శాతం తగ్గిపోయి 287 మిలియన్లకు చేరాయి. జూన్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో విడి భాగాల ఆర్డర్లను ఆయా సంస్థలు అర్ధంతరంగా తగ్గించడం దీనికి కారణం అని కానలైస్ అనే అధ్యయన సంస్థ పేర్కొంది. 2020 ద్వితీయ త్రైమాసికం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారని తెలిపింది.
మొత్తం ఆర్డర్లలో దక్షిణ కొరియాకు చెందిన శ్యామ్సంగ్ 21 శాతం (61.8 మిలియన్లు) వాటా కైవసం చేసుకున్నది. రెండో స్థానంలో ఆపిల్ వారి ఐఫోన్ 17 శాతంతో 49.5 మిలియన్ల స్మార్ట్ఫోన్లు విక్రయించింది. మూడో స్థానంలో చైనాకు చెందిన షియోమీ నిలిచింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 39.6 మిలియన్ల ఫోన్లను షియోమీ విక్రయించింది.
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు ఒప్పో (27.3 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు), వివో (25.4 మిలియన్ల ఫోన్లు) నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచాయి. శ్యామ్సంగ్ ఆరు శాతం సేల్స్ పెంచుకున్నా.. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం పడిపోయింది. నార్త్ అమెరికా, చైనా, యూరప్ దేశాల్లో ఆపిల్ ఐ-ఫోన్ 13 సిరీస్కు డిమాండ్ కొనసాగుతున్నది.