న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కరోనా నుంచి దేశం కోలుకుంటున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో భారీ అమ్మకాలపై ఆశలు పెట్టుకున్న వ్యాపారస్తులకు అనుకోని విఘాతం ఎదురయ్యింది. వినియోగదారుల నుంచి కొనుగోళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, సెమి కండక్టర్ చిప్స్ కొరతతో ఉత్పత్తుల్ని సరఫరా చేయలేని పరిస్థితిలో వివిధ రంగాలున్నాయి. కార్ల కొనుగోలుకు ఆటోమొబైల్ పరిశ్రమలో 5 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉండటం… పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అంతర్జాతీయంగా సెమి కండక్టర్ చిప్స్కు ఏర్పడిన కొరత ప్రభావం మొబైల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలపై అధికంగా ఉంది.
దసరా, దీపావళి పండుగ సీజన్లో కస్టమర్లకు సాధారణంగా ఆకర్షణీయమైన డిస్కౌం ట్లు లభిస్తుంటాయి. ఈ దఫా డిస్కౌంట్ల మాట అటుంచి, పలు ఉత్పత్తుల కొనుగోలుకు అధిక ధర చెల్లించాల్సి వస్తున్నది. చిప్ల కొరతతో మొబైల్ హ్యాండ్సెట్లు, టీవీల నుంచి కార్ల వరకూ ధరలు పెరిగాయి. ఆటోమొబైల్ షోరూంల్లోనైతే ఉచితంగా ఇచ్చే విడిభాగాలు, సర్వీసులకు ఈసారి స్వస్తి పలికారు. ఇంజన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు, కీలెస్ ఎంట్రీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ సరఫరా తగ్గిందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.